రీజినల్‌ రింగ్‌రోడ్డు విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి కీలకమైన నాలుగు 3ఏ (క్యాపిటల్‌ ఏ) గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలోనే భూసేకరణకు కాంపిటెంట్‌ అథారిటీగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధి, ఆందోల్‌–జోగిపేట ఆర్డీవో, చౌటుప్పల్‌ ఆర్డీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవగా.. ఇప్పుడు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు వీలుగా గెజిట్‌ నోటిఫికేషన్లను కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. ఒక్క తూప్రాన్‌ ఆర్డీవో పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది.

అభ్యంతరాలకు 21 రోజులు గడువు
సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో భూసేకరణ గెజిట్‌ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజులలోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు, చేయాల్సిన మార్పుచేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్‌ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక.. సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956 (48) సెక్షన్‌ 3సిలోని సబ్‌ సెక్షన్‌ 1 ప్రకారం.. అభ్యంతరాలపై కాంపిటెంట్‌ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజిట్‌లో పేర్కొన్నారు.

హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే..
రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంటుకు సంబంధించి ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. గెజిట్లు విడుదలైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దు రాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3డి గెజిట్‌ నోటిఫకేషన్‌ను విడుదల చేయనున్నారు.